తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని.. ఎన్నికలయ్యే వరకూ 2 ప్లస్ 2 గన్మెన్లను కేటాయించాలని కోరుతూ శిరీష రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు రోజు రోజుకు ఆదరణ లభిస్తుండటంతో ఇతర పార్టీల అభ్యర్థులు అడ్డంకుల్ని సృష్టిస్తున్నారని ఆమె పిటిషన్లో ప్రస్తావించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఈ నెల 21న తన సోదరుడిపై దాడి కూడా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాను పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు.
నిరుద్యోగిగా ఉన్న తాను యువత ప్రోత్సాహంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రచారంలో నియోజకవర్గ ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని.. తనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. తన తమ్ముడిపై దాడి జరిగిన తర్వాత పోలీసు కేసు చేశారని గుర్తు చేశారు. తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చినా పోలీసులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా హోంశాఖ, రాష్ట్ర ఎన్నికల అధికారి, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, పెద్దకొత్తపల్లి ఎస్హెచ్ఓలను పేర్కొన్నారు. పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు.
తెలంగాణ హైకోర్టులో బర్రెలక్క పిటిషన్ కొల్లాపూరు నియోజకవర్గంలో తాను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు దాడులకు ప్రయత్నిస్తున్నారని శిరీష ఆరోపిస్తున్నారు. తన తమ్ముడిపై దాడికి పాల్పడింది ఎవరో.. వారు ఏ పార్టీ వారో కూడా తెలుసన్నారు. కానీ తాను వారి పార్టీ పేరు చెప్పదల్చుకోలేదని.. ప్రాణం పోయినా.. ఈ పోరాటంలో వెనకడుగు వేయనని తేల్చి చెప్పారు. నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు, అధికార పార్టీ వాళ్లు తనను చూసి భయపడుతున్నారన్నారు.
అందుకే తనను టార్గెట్ చేసి రౌడీమూకలతో దాడులకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే వ్యక్తిని సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి తొలగించారని.. అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తాను ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా.. భవిష్యత్లో వెయ్యి అడుగులు వెనక్కి వేసిన దాన్ని అవుతానన్నారు. తాను వెనకడుగు వేస్తే యువతకు తప్పుడు సంకేతం అవుతుందన్నారు.









