ఇటీవల నటి త్రిషపై విలన్ పాత్రల నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో అనేక సినిమాల్లో రేప్ సీన్లు చేశానని, లియో చిత్రంలోనూ త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ లేకపోవడం బాధ కలిగించిందని మన్సూర్ అలీఖాన్ ఇటీవల వ్యాఖ్యానించాడు. లియో షూటింగ్ కశ్మీర్ షెడ్యూల్లో త్రిషను కనీసం ఒక్కసారి కూడా తనకు చూపించలేదని వాపోయాడు. అయితే మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. త్రిష అయితే మండిపడింది. తన ప్రస్తావన తెస్తూ చాలా అసహ్యంగా మాట్లాడిన వ్యక్తితో నటించనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీకి స్పష్టం చేసింది. సినీ రంగంలోని ప్రముఖులు కూడా త్రిషకు మద్దతుగా నిలిచి, మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో, మన్సూర్ అలీఖాన్ తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాడు. త్రిష తన సహ నటి అని, ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించాడు. త్రిష పట్ల తనకు గౌరవం ఉందని, తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ప్రచారం చేశారని తెలిపాడు. తాను ఎలాంటి వ్యక్తినో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని మన్సూర్ అలీఖాన్ అన్నాడు. పనిలోపనిగా జనాలపై వ్యంగ్యం ప్రదర్శించాడు. “చారిత్రక యుద్ధం ముగిసింది… ఇక ఎవరి పనులు వాళ్లు చూసుకోండి…. మీ తిట్లే నాకు దీవెనలు!” అంటూ వ్యాఖ్యానించాడు.









