రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
దుబ్బాకకు రావాల్సిన నిధులను మామ అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్ రావు) సిద్దిపేటకు తరలించుకుపోయారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం దుబ్బాకలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు గురించి మాట్లాడుతూ.. మూడెళ్లలో రఘునందన్ రావు ఎం చేశారో చెప్పాలి. ఇచ్చిన మాట తప్పిన రఘునందన్ రావుకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ రాజకీయ కుమ్ములాటల్లో రఘునందన్ మునిగిపోయారని అన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై స్పందిస్తూ.. కేసీఅర్ దొర గడి వద్ద కపలకాసే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు దుబ్బాక రెవెన్యూ డివిజన్ చేయలేదని ప్రశ్నించారు.
కేసీఅర్ కుటుంబానికే బంగారు తెలంగాణ ఐతే.. ప్రజలకు బొందల తెలంగాణగా మారింది. నేను బక్కొన్నని కేసీఅర్ అంటున్నారు. బక్కోనికి బుక్కెడు బువ్వ, రెండు పెగ్గుల మందు కావాలి.. కానీ 10 వేల ఎకరాలు మింగినవ్. ఆ పక్క హరీశ్ రావు, మరో పక్క కేటీఆర్ ఉండి దుబ్బాకను ఎందుకు బంగారు తునుక చేయలేదు? అని మండిపడ్డారు.
కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఅర్ మతి పోయి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియడం లేదన్నారు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తాం. విద్యార్థుల విద్యకు 5 లక్షలు ఇస్తాం. ఈ నెల కేసీఅర్ ఉంటే మీకు రూ.2 వేలే.. వచ్చేనెల కేసీఅర్ సర్కారును బొంద పెడితే రూ.4 వేలు ఇస్తాం. కేసీఅర్ కు కూడా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా. కేసీఅర్ తో పాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండడానికి కచ్చితంగా ఇలు కట్టిస్తా. కేసీఅర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తా’’ అని రేవంత్ అన్నారు.









