కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారని, తన బిడ్డ వల్లనే తన సీటు పోతుందని బీఆర్ఎస్ అధిష్ఠానానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామలో తాను అన్ని రకాల అభివృద్ధి పనులు చేశానని, దీంతో తన గురించి తమ పార్టీ అధిష్ఠానానికి చెప్పే ప్రతికూల విషయం ఏమీ లేదని అన్నారు.
జనగామ నియోజకవర్గంలో తమ కార్యకర్తలతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమావేశం నిర్వహించారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ముత్తిరెడ్డి మద్దతు లేకుండా గెలవడం కష్టమని కార్యకర్తలు అన్నారు.
ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడారు. ఇన్నేళ్లు తనతో కలిసి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తన నియోజక వర్గంలో ఇంతకుముందు వరకు సీఎం కేసీఆర్ వర్గం తప్ప వేరే వర్గం లేదని, అటువంటిది ముత్తిరెడ్డి వర్గం అని చెప్పేటట్లు కొందరు చేశారని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఇప్పుడు తన విషయంలో కేసీఆర్ సానుకూల అలోచనలో పడ్డారని అన్నారు. కొందరు ఎమ్మెల్యే లేకుండా మీటింగులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇటువంటివి పార్టీకి మంచిది కాదని అన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి తనను గెలిపించికుంటామని అంటున్నారని తాను కేసీఆర్ కు చెప్పానని తెలిపారు.









