AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు షాక్.. పోలీసు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశం

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా నవదీప్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారని అతడి తరపు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదానలు విన్న హైకోర్టు ధర్మాసనం.. నవదీప్‌‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. నోటీసులు అందుకున్నాక పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందిగా నవదీప్‌కు న్యాయస్థానం సూచించింది.

గత నెల 31న మాదాపూర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌లో డ్రగ్‌ పార్టీ జరిగింది. సోదాలు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్‌ అనే నిందితుడి విచారణలో నటుడు నవదీప్‌ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్‌ సైతం తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రామ్‌చంద్‌ తన వాంగ్మూలంలో వెల్లడించాడు. దీంతో టీఎస్‌ నాబ్‌ అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. అయితే ఈ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని నవదీప్ వెల్లడించారు.

కేసులో తన పేరు బయటకురావడంతో ఇటీవల నవదీప్‌ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ వినియోగదారుల జాబితాలో తనను అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్‌ హైకోర్టులో సెప్టెంబర్‌ 15న పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ నవదీప్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను ముందుస్తు బెయిల్ పిటిషన్‍‌ను డిస్పోజ్‌ చేసింది. దీంతో నవదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

ANN TOP 10