కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన యూట్యూబ్ చానల్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. అందులో, ఆయన ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన దృశ్యాలు ఉన్నాయి. ఇటీవల ఆయన తన సొంత నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ మార్గమధ్యంలో ఊటీలో ఆగారు. అక్కడ అంతా మహిళలే నిర్వహిస్తున్న ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని అడిగి చాక్లెట్ల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం తాను కూడా కొన్ని చాక్లెట్లను తయారుచేశారు.
మురళీధర్ రావు, స్వాతి అనే స్ఫూర్తిదాయక దంపతులు ఈ మోడీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ స్థాపన వెనుక కీలకపాత్ర పోషించారని రాహుల్ వెల్లడించారు. వీరికి ఇతర మహిళల బృందం సహకరిస్తోందని, ఈ 70 మంది మహిళలు తయారుచేస్తున్న చాక్లెట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వాటిలో కొన్ని తాను ఎప్పుడూ రుచి చూడనంత అమోఘంగా ఉన్నాయని కితాబిచ్చారు.









