AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో వచ్చేది మేమే.. : అమిత్ షా

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది మేమేనని, కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓవైసీ ఉన్న వేదికను కూడా కనీసం పంచుకోబోమన్నారు. కేసీఆర్ సర్కారుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది 4జీ, 3జీ, 2జీ పార్టీలు కాదని.. ప్రజల పార్టీ అయిన బీజేపీనే అని అమిత్ షా పేర్కొన్నారు. ఖమ్మంలో “రైతు గోస- బీజేపీ భరోసా” అనే పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అటు సీఎం కేసీఆర్‌పై.. ఇటు ఎంఐఎం పార్టీతో పాటు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు నూకలు చెల్లాయని అమిత్ షా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాటు సోనియా గాంధీ కుటుంబం కోసం పని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని తెలిపిన అమిత్‌షా.. శ్రీరామనవమికి రామయ్యకు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ.. రాములోరి గుడికి మాత్రం వెళ్లదంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందంటూ ఆరోపించారు. ఇక.. కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలానికి వెళ్లి రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారంటూ అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

నిన్న చేవెళ్లలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్‌షా స్పందించారు. కేసీఆర్‌, బీజేపీ ఏకమవుతాయని మల్లికార్జున ఖర్గే.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ పక్కన ఒవైసీ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందేని.. అలాంటి కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్‌ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి ఇంటికి సాగనంపాలని అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10