ప్రతిపక్షాలకు కేటీఆర్ చురకలు!
ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే.. త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందిరా పార్క్ కు నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిను (నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్) ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన తరువాత కట్టిన 20వ ఫ్లై ఓవర్ ఇది, అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు.
గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన సచివాలయం, అమరవీరుల స్తూపం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. దీంతో పాటు ఇందిరా పార్కును కూడా అభివృద్ధి చేస్తాం అన్నారు.
ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివద్ధి చేసే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం చేస్తున్నదిని తెలిపారు. కులాలకు, మతాలకు వర్గాలకు అతీతంగా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుకూలంగా గట్టి పునాది ఈ తొమ్మిది సంవత్సరాలలో పడిందన్నారు.
గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దుస్థితి ఈరోజు లేదన్నారు. గత పది సంవత్సరాలలో మత కల్లోలాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు, చిల్లర పార్టీల వారి మోసాలకు గురైతే మరో వందేళ్లు ఈ నగరం వెనక్కి పోతుందని, 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దని కేటీఆర్ సూచించారు. ఇప్పటిదాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా త్వరలో ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీ సినిమా చూపించబోతున్నదని కేటీఆర్ హెచ్చరించారు.









