గన్మెన్ల తొలగింపుపై వీహెచ్ ఫైర్
పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రమంతా తిరిగే రేవంత్ కి ఏదైనా జరిగితే బాధ్యత ఎవ్వరిది? అని, జాతీయ పార్టీ నాయకుడికి భద్రత లేకుండా చెయ్యడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే నాకు, మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రెండుసార్లు ప్రధాని మోదీని కలిసినా ప్రయోజనం లేదన్నారు. తెలంగాణాలో 54 శాతం బీసీలు ఉన్నారని, ప్రత్యేక మంత్రి శాఖను కేటాయించాలని కోరామని తెలిపారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. బీసీ గర్జన నిర్వహణ కోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ హామీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. తాను ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటించానని.. బీసీల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారని.. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నామని.. కనీసం రెండు లక్షల మందితో సభ పెడతామని వీహెచ్ వెల్లడించారు.









