ఐఐటీ హైదరాబాద్లో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఐఐటీ హైదరాబాద్లో బీటెక్ ఫస్టియర్ చదువుతోన్న విద్యార్థిని మమైత (20) నాయక్ మంగళవారం (ఆగస్టు 8) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్ధిని మమైత ఐఐటీ క్యాంపస్లో ఎంటెక్ చదువుతోంది. ఆమె జూలై 26న క్యాంపస్కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ ఒరియా భాషలో సూసైడ్ లెటర్ రాసి బలవణ్మరణానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలోని సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకుని, విద్యార్ధిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువులో ఒత్తిడికి గురి కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. చదువులో ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని మమైతా సూసైడ్ నోట్లో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ పోలీసధికారి తెలిపారు.
కాగా సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. తాజాగా మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఐఐటీ విద్యార్థుల వరుసగా ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.









