వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంవోయూకు కేంద్రం సిద్దంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ సర్కార్ ముందుకు రావటం లేదని విమర్శించారు. ప్రధానమంత్రితో గొడవ పడి మరీ తెలంగాణలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే దేశంలోని రైతులకు లబ్ది చేకూరుతోందని తెలిపారు. సబ్సిడీ రూపంలో ఎకరాకు 18వేల 600, కిసాన్ సమ్మాన్ నిధి రూపంలో ఆరు వేలు ఇస్తున్నామన్నారు.
రెండు ఎకరాలు ఉన్న రైతుకు రూ.43 వేలు.. పది ఎకరాల రైతుకు లక్షా 92వేల రూపాయలు లబ్ది చేకూరుతోందని చెప్పారు. కేంద్ర బడ్జట్లో సుమారు ఆరు శాతం రైతుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్రం నిర్ణయాలతో బియ్యం ఎగుమతులు పెరిగి.. నూనె దిగుమతులు తగ్గాయన్నారు. పత్తి పంటకు 75శాతం మద్దతు ధర పెంచామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం ఏడాదికి 26వేల 356కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని తెలిపారు. భారత బ్రాండ్ పేరుతో యూరియాను రైతులకు అందజేస్తున్నామని… మోదీ హాయాంలో రైతులకు యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.









