బెంగళూరు: కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) సమావేశం అధికారికంగా సిద్ధరామయ్యను కర్నాటక నాయకుడిగా,ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. అలాగే డికె.శివకుమార్ను ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నాలుగు రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికింది. సిద్ధరామయ్య, డికె. శివకుమార్లు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు తమ వాదన వినిపించారు. మే 20న బెంగళూరులో జరిగే మెగా ఈవెంట్లో వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రస్తుతం సిద్ధరామయ్య, డికె.శివకుమార్ ఢిల్లీలో క్యాబినెట్ రూపకల్పనపై చర్యలు జరుపుతున్నారు. అయితే శివకుమార్ మాత్రం ‘రేపు జరుగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి నాయకులను పిలువడానికే మేము ఢిల్లీ వచ్చాము. పార్టీ ప్రధాన నాయకులంతా సరైనా దిశా నిర్దేశన చేయడానికి, కర్నాటక వచ్చి చెమటోడ్చారు. అందుకే నేను వారిని వ్యక్తిగతంగా ఆహ్వానించాలనుకునే ఇక్కడికి వచ్చాను. ఇక క్యాబినెట్ ఏర్పాటు అనేది తర్వాత చర్చిస్తాము’ అన్నారు.









