ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు పాలిటిక్స్
హైదరాబాద్కు ఎమ్మెల్యేలు తరలింపు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ప్రతీ రౌండ్లోనూ కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ సీట్లు 113ను దాటేసి గెలుపు దిశగా దూసుకెళ్తుంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 120కిపైగా సీట్లతో హస్తం ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రెండ్స్ను బట్టి చూస్తుంటూ కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కర్ణాటకతో పాటు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు మొదలుపెట్టారు.
అయితే బీజేపీ కూడా 80, జేడీఎస్కు 30 సీట్లతో కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసి లాగేసుకుంటుందనే సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అందులో భాగంగా హైదరాబాద్కు ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కాంగ్రెస్ హైదరాబాద్ వేదికగా క్యాంపు రాజకీయాలు నడిపేందుకు సిద్దమవ్వడంతో కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ హైదరాబాద్పై పడింది. హైదరాబాద్లో ప్రముఖ హోటల్స్లో ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్ వ్యక్తులు రూమ్లు బుక్ చేశారు. పార్క్ హయత్, తాజ్ కృష్ణ, నోవాటెల్ హోటల్లో బల్క్గా రూమ్స్ బుక్ చేశారు. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్లో 20, నోవాటెల్ హోటల్లో పలు రూమ్లను ఇప్పటికే బుక్ చేసి పెట్టారు. గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్లోని హోటళ్లకు తరలించే అవకాశముంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హైకమాండ్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కర్ణాటక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తోన్నారు. ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులందరూ బెంగళూరుకు రావాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశముంది.









