తెలంగాణలో రాజకీయంగా మరింత పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. ఇకపై వరుస కార్యక్రమాలతో యాక్టివ్ మోడ్ లోకి వెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు విరామం లేకుండా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ సిద్ధం చేసింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం సులువయ్యేలా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణను రూపొందించారు. భవిష్యత్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది.
వచ్చేనెల 5వ తేదీన..
ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రంలోని ప్రతి శక్తి కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం వచ్చేనెల 5వ తేదీన ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మా కే నామ్.. ఏక్ పేడ్ పేరుతో మొక్కలు నాటే కారక్రమాన్ని చేపట్టనున్నారు. జూన్ 10వ తేదీన 12 ఏండ్ల మోడీ పాలనపై కేంద్రమంత్రులతో ప్రెస్ మీట్ నిర్వహించేలా ప్లాన్ చేసుకున్నారు. జూన్ 11, 12 తేదీల్లో జిల్లాల్లో మోడీ 12 ఏండ్ల పాలనపై ప్రెస్ మీట్ లు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా జూన్ 10 నుంచి 20 వరకు ప్రతి పార్లమెంట్ నియోజక వర్గ స్థాయిలో సహజ వ్యవసాయ కార్యశాలలు నిర్వహించనున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం..
మోడీ పాలనపై జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు వివిధ వర్గాల్లో ఉన్న ప్రముఖులను కలిసే ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసుకున్నారు. జూన్ 17, 18 తేదీల్లో మోడీ ప్రభుత్వ విజయాలపై జిల్లా స్థాయిలో ఎగ్జిబిషన్లు ఏర్పాటుచేయడంతో పాటు సమావేశాలు నిర్వహించేలా అధిష్టానం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. జూన్ 20, 21 తేదీల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. అలాగే వచ్చేనెల 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, జూన్ 25 న ఎమర్జెన్సీ డే వరకు విభిన్న కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కాషాయ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఎమర్జెన్సీ డే..
ఈ కార్యక్రమాల ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఎమర్జెన్సీ డే వరకు వరుస కార్యక్రమాలతో పొలిటికల్ మైలేజ్ సాధించేందుకు కమల నాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేలా పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం నుంచి ఎమర్జెన్సీ డే వరకు ఎలాంటి విరామం లేకుండా వరుస కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కేడర్లో జోష్ నింపాలని బీజేపీ భావిస్తోంది. ఈ నిరంతర ప్రజా సంపర్క కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికల పోరాటాన్ని సులువు చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మరి ఈ వరుస కార్యక్రమాలు పార్టీ మైలేజ్ ను పెంచుతాయా? లేదా? అనేది చూడాలి.









