ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు, దానిని సమర్థంగా గ్రిడ్కు అనుసంధానించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా, సుమారు రూ.22 వేల కోట్ల వ్యయంతో ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3’ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ శాఖ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్, విద్యుత్ సరఫరా, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలు పురోగతిపై విస్తృతంగా చర్చించారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద చేపట్టనున్న చర్యలపై సీఎం ఆరా తీయగా, అధికారులు పూర్తి వివరాలు అందించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 18 గిగావాట్ల హరిత విద్యుత్ను ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో 11 గిగావాట్ల సౌర విద్యుత్, 7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉంటుందని వివరించారు.
ఈ కారిడార్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు, 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో ఐదు భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందని, తద్వారా భారీ పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కాలపరిమితితో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలి
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలులో ఏపీ ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉందని, అగ్రస్థానానికి చేరేలా అధికారులు కృషి చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 1,35,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చామని, మిగిలిన వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు రూ.20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు బిగించే లక్ష్యాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై 200 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే పనులు వేగవంతం చేయాలన్నారు. రెస్కో మోడల్లో, నెట్ మీటరింగ్ విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. అలాగే, 2,898 హాస్టళ్లు, స్కూళ్లలో ‘నెట్ జీరో’ విధానంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
సాంకేతికతతో విద్యుత్ నష్టాలకు చెక్
దేశంలోనే తొలిసారిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘ప్రవాహ్’ సంస్థ సహకారంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ద్వారా ‘డిజిటల్ ట్విన్ గ్రిడ్’ రూపొందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.
మరోవైపు, రాష్ట్రంలో 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,226 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది మే 21న రాష్ట్రంలో అత్యధికంగా 15,016 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని గుర్తుచేశారు.
సీఎంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం భేటీ
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ (C4IR) కార్యాచరణపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ రెసిలియెన్స్ వంటి అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేయనుంది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులను C4IR కార్యాచరణతో అనుసంధానం చేయాలని, ఫలితాలు సాధించేలా పనిచేయాలని ఆదేశించారు. వచ్చే దావోస్ సదస్సు నాటికి ఏపీ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పే స్థాయికి ఎదగాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








