టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల సమయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విధించిన పరిమితిని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయరాదన్న నిబంధన రాజ్యాంగబద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలు ఎంటర్టైన్మెంట్, న్యూస్, ప్రాంతీయ ఛానళ్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. గంట వ్యవధిలో 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాల స్వీయ ప్రచార ప్రకటనలకు మాత్రమే అనుమతిస్తూ ట్రాయ్ జారీ చేసిన నిబంధనలు తమ వ్యాపార, వాక్ స్వాతంత్య్ర హక్కులను ఉల్లంఘిస్తున్నాయని బ్రాడ్కాస్టర్లు వాదించారు.
అయితే, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్రసార తరంగాలు (ఎయిర్వేవ్స్), స్పెక్ట్రమ్ పరిమితమైన ప్రజా ఆస్తి అని, వాటిని అపరిమిత వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకునే హక్కు బ్రాడ్కాస్టర్లకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అధిక ప్రకటనల నుంచి వీక్షకులను రక్షించడం, ప్రసారాల నాణ్యతను కాపాడటం ట్రాయ్ బాధ్యత అని పేర్కొంది. డిజిటల్ ప్లాట్ఫామ్ల మాదిరిగా టీవీలో ప్రకటనలను స్కిప్ చేసే అవకాశం లేనందున, వీక్షకుల హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది.
లాభదాయకత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాపారంపై సహేతుకమైన పరిమితులు విధించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 17 పిటిషన్లను కొట్టివేస్తూ, ట్రాయ్ నిబంధనలు సమతుల్యంగా ఉన్నాయని తీర్పు చెప్పింది.








