దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది అభిమానులను తన నటనతో, డాన్సులతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తొలిసారిగా ఆయన డిజిటల్ ప్రపంచంలోకి (OTT) అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒక ప్రతిష్టాత్మక పోడ్కాస్ట్ (Podcast) టాక్ షో ద్వారా ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
శూన్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి, ఒక సాధారణ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ స్థాయికి ఎలా ఎదిగారు? ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు, ఎవరికీ తెలియని తెరవెనుక ఆసక్తికర సంఘటనలు, విజయాల వెనుక ఉన్న అసలు కథలను ఈ పోడ్కాస్ట్ ద్వారా చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకోబోతున్నారు. రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ షో ఉండబోతోంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి రూపొందిస్తున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్స్టాపబుల్’ షోను తన రైటింగ్, కంటెంట్తో సూపర్ హిట్ చేసిన ఆయన.. ఇప్పుడు చిరంజీవి ప్రాజెక్ట్కు బాధ్యతలు చేపట్టడం అంచనాలను మరింత పెంచేసింది.
ఈ పోడ్కాస్ట్ గురించి గతంలో చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం కనిపిస్తోంది. బి.వి.ఎస్. రవి కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు.
అయితే ఈ షోలో ఎవరెవరు గెస్టులుగా పాల్గొంటారు? చిరంజీవితో కలిసి పనిచేసిన స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, తోటి నటీనటులు ఇందులో కనిపిస్తారా? లేక ఆయన కెరీర్లోని ఇండస్ట్రీ హిట్ చిత్రాలను బేస్ చేసుకుని ఎపిసోడ్లను డిజైన్ చేస్తారా? అనే అంశాలపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన మెగాస్టార్.. ఈ కొత్త డిజిటల్ ఇన్నింగ్స్తో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.








