ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. హైదరాబాద్లో అడుగుపెట్టనుంది. నగరంలో తమ సేల్స్, సర్వీస్ సెంటర్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో టెస్లా ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్.. మంత్రి శ్రీధర్బాబుతో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు, వీలైనంత త్వరగా విక్రయాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వారు స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు షోరూమ్లను విజయవంతంగా ఏర్పాటు చేసిన టెస్లా, తమ తదుపరి ప్రతిష్ఠాత్మక కేంద్రంగా హైదరాబాద్ను ఎంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. టెస్లా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీకి అవసరమైన అత్యాధునిక సాంకేతికతలతో కూడిన బలమైన ఎకోసిస్టం ఉందని వివరించారు. సెమీకండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్నాలజీ వంటి రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఆయన అన్నారు. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో టెస్లా అగ్రగామిగా ఉందని మంత్రి కొనియాడారు.
భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణహిత రవాణాను తమ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ను క్లీన్ టెక్నాలజీ, గ్లోబల్ మొబిలిటీకి ప్రపంచస్థాయి హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం షోరూమ్లకే పరిమితం కాకుండా తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు, పరిపాలనా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం 4 శాతమేనని, ఈ రంగంలో వృద్ధికి అపార అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు శశాంక, నిఖిల్ చక్రవర్తి, రఘురామశర్మ, సాయికృష్ణ తదితరులు పాల్గొని టెస్లా విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. టెస్లా రాకతో తెలంగాణ ఆటోమొబైల్ రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింతగా రాణిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








