తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిలో పడింది. రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, జీఎస్టీ భారం, కరెంట్ బిల్లుల మోతతో కుదేలవుతున్న ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆర్-పార్ పోరాటానికి సిద్ధమయ్యారు. “పర్సంటేజ్ పద్ధతి ఇస్తేనే థియేటర్లలో సినిమాలు వేస్తాం.. లేదంటే ప్రదర్శనలు నిలిపివేస్తాం” అంటూ ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి రావడం టాలీవుడ్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరియు ప్రొడ్యూసర్ల అత్యవసర సమావేశం ఇండస్ట్రీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. తెలంగాణ నలుమూలల నుండి ఎగ్జిబిటర్లు భారీ ఎత్తున ఈ భేటీకి తరలివస్తుండటంతో ఫిలిం ఛాంబర్ పరిసరాలు వేడెక్కాయి.
తెరవెనుక అసంతృప్తి!
గతంలో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ చర్చనీయాంశమైంది. ఎగ్జిబిటర్ల సమస్యలను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు తీసుకెళ్లి పరిష్కరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దల నుండి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రాలేదు.
ముఖ్యంగా, పెద్ద సినిమాల విడుదల సమయంలో ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను పక్కనబెట్టి, పాత రెంట్ల పద్ధతి లేదా కనీస గ్యారెంటీ (MG)ల కోసమే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎగ్జిబిటర్ల హక్కులను కాపాడటంలో ఇండస్ట్రీ అంతర్గత ఒత్తిళ్లు, న్యాయమైన డిమాండ్ల పట్ల కొందరు చూపిన ఉదాసీనత వల్లే, తీవ్ర అసంతృప్తితో సునీల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్ల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రాజీనామా కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది వ్యవస్థపై జరిగిన నిరసనగా ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.








