మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్రెడ్డి. మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులో మోదీ సర్కార్ కుయుక్తులు పన్నిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్తో లింక్ పెట్టారన్నారు. వెంటనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి,మహిళా బిల్లును మళ్లీ పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టాని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశంలో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.
ఆయన స్ఫూర్తితో పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కోరారు. దేశానికి సాంకేతిక, టెలికాం విప్లవాన్ని పరిచయం చేసి ప్రపంచ పటంలో దేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ వ్యక్తి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాయని వివరించారు.
భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారు-సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి, గాంధీ కుటుంబానికి మధ్య దశాబ్దాల కాలంగా అవినాభావ సంబంధం ఉందన్నారు. రాజకీయ బంధం కాదని, కుటుంబ సంబంధాల కంటే ఎంతో పవిత్రమైనది అన్నారు. రాహుల్గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ సాకారమైందన్నారు.
తెలంగాణ ఉన్నంత కాలం గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని, సహాయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పూర్తిగా రాజీవ్ ఆశయాలు, స్ఫూర్తితో ప్రజాక్షేమం కోసం ముందుకు సాగుతుందన్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని మోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తుందన్నారు. అందుకే ఎన్నికలు కాగానే పెట్రోల్-డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారని ఆరోపించారు. మా ప్రభుత్వం ప్రతీ అంశాన్ని దీర్ఘకాలిక దృష్టితో చూస్తోందన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, మరో 20 శాతం మిగిలి ఉందన్నారు. ఆ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తోందని, శవ రాజకీయాలు చేయాలని చూస్తోందన్నారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా? నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
POCSO కేసులో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. తన కుమారుడిని సంజయ్ అప్పగించి ఉంటే ఆయన ఇంట్లో అప్పగించి ఉండేవారన్నారు. POCSO కేసులో ఏదో సాధించినట్లు బీఆరెఎస్ నేతలు శాడిస్టులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి గానీ, దిగజారి ప్రవర్తించొద్దని హితవు పలికారు.
కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీసు ఇచ్చి విచారించామని, బండి భగీరథ్ విషయంలోనూ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నామన్నారు. POCSO కేసులో పోలీసులు చట్ట ప్రకారం తమ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.








