రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎస్ఎస్) సత్ఫలితాన్ని ఇస్తోంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే ఈ వ్యవస్థ సింగరేణికి ఆర్థిక లబ్ధి చేకూర్చుతోంది. నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్ కు అనుబంధంగా 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ను సింగరేణి నెలకొల్పింది. ఇందుకోసం రూ.2.5 కోట్లను యాజమాన్యం వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.
98.50 మెగావాట్ల సామర్థ్యం
సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్తు గ్రిడ్డులకు అనుసంధానం చేసింది. ఈ ఇన్ హౌజ్ ప్లాంట్ల విద్యుత్తును కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసినప్పటికీ విద్యుత్ ఒప్పందం ప్రకారం ఇక్కడ స్థానిక అవసరాలకు వాడగా మిగిలిన విద్యుత్తుకు మాత్రం తెలంగాణ డిస్కం ఎటువంటి చెల్లింపులు జరపదు.
సింగరేణి సంస్థ..
మిగులు విద్యుత్ ను కేవలం ఉచితంగానే గ్రిడ్డుకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్ హౌస్ ప్లాంట్ల నుంచి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్ ను ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్ కు సరఫరా చేయడం జరుగుతోంది. అయితే ఈ మిగులు విద్యుత్ ను కూడా సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్ ను మందమర్రి ప్లాంట్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.
జనవరి నెలలో..
మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తూ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా లలోని గనులకు, కాలనీలకు అవసరమైన విద్యుత్ ను అందిస్తోంది. అయితే స్థానిక విద్యుత్ అవసరాలకు సరిపోగా ఇంకా కొంత విద్యుత్ మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో మందమర్రి ప్లాంటులో జనవరి నెలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరీ సిస్టంను సింగరేణి ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా ఇంకా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్ ను నిల్వ చేసుకుని అవసరమైన సందర్భంలో వినియోగించుకుంది.
ప్రభుత్వ ఆదేశాలతో..
తద్వారా సింగరేణి సంస్థకు రూ.25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ ను ఆదా చేయడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బీఈఎస్ఎస్ విజయవంతం అవడంపై సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది







