AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ..!

ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి రథ చక్రం ఆగిపోతుందని సీపీఐరాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయ పార్టీలను అధికారంలో కూర్చొబెట్టే ప్రథమ శక్తి ఆర్టీసీ కార్మికులదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పోకడలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రతి కార్మికుడికి ఊపిరి అందిస్తున్న సంఘం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటీయూసీ అన్నారు.

 

తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర విస్త్రతస్థాయి కౌన్సిల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ భాగ్ లింగంపల్లి, వీఎస్టీ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. తొలుత బస్ భవన్ నుంచి సమావేశ ప్రాంగణం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కార్మికులు కన్నెర్ర చేస్తే టాటాలు, బిర్లాలు, అంబానీలు కూడా కార్మికుల కాళ్ల దగ్గరికి రావాల్సిందేనని తేల్చి చెప్పారు. కార్మికవర్గాన్ని ఏదైనా చేయవచ్చని పాలకులు భావిస్తున్నారని, దానిలో భాగంగానే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కార్మిక సంఘాలు, కార్మికుల హక్కులు లేకపోతే ఇదేం ప్రజాపాలన అని పలుమార్లు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానంతో ప్రభుత్వం దిగి వచ్చి, ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకు అంగీకరించిందన్నారు. తొలుత యూనియన్లు ఏర్పాటు చేసుకుని, ఆ తర్వాత విలీనం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. విలీనానికి ముందు ఎన్నికలు జరిగితే ఎంప్లాయిస్ యూనియన్ తరపున, విలీనం తర్వాత ఎన్నికలు జరిపితే ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ మనమే గెలవాలని పిలుపునిచ్చారు.

 

ఆర్టీసీ ఉన్నంతకాలం ఎంప్లాయిస్ యూనియన్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.సీపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్.బోస్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ , ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.పద్మాకర్, అధ్యక్షులు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ, ముఖ్య ఉపాధ్యక్షుడు వెంకన్న గౌడ్, డి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10