కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాలనలో కేవలం అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.75 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వ ఆదాయ వృద్ధి రేటు ఎందుకు 3.22 శాతానికి పడిపోయిందని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రం నిజంగానే అభివృద్ధి చెందితే, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ఆయన నిలదీశారు.
వైసీపీ పాలనలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ. 85,922.23 కోట్ల ఆదాయం వచ్చిందని జగన్ గుర్తుచేశారు. గడిచిన రెండేళ్లలో సాధారణంగా ఉండాల్సిన 8 శాతం వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకున్నా, 2025-26 నాటికి ఈ పన్నుల ఆదాయం రూ. 1,00,219.69 కోట్లకు చేరాల్సి ఉందన్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో వాస్తవంగా వచ్చింది కేవలం రూ. 86,552.68 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఈ లెక్కల ప్రకారం అంచనాల కంటే దాదాపు రూ. 13,667 కోట్ల మేర రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడాన్ని చంద్రబాబు ప్రభుత్వం ‘సంపద సృష్టి’ అని ఎలా పిలుస్తుందని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.







