విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ గురువారం పరామర్శించారు. క్రాంతి కుమార్ భార్య, పిల్లలు, తండ్రిని ఓదార్చిన జగన్, వారికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందనడానికి క్రాంతి కుమార్ ఆత్మహత్యే నిదర్శనమని అన్నారు. “ఆత్మహత్య చేసుకునే ముందు క్రాంతి కుమార్ స్వయంగా సెల్ఫీ వీడియో తీసి, సీఐ నాగరాజు, ఇతర పోలీసుల వేధింపుల గురించి వివరించారు. అయినా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిదేళ్ల క్రితం నమోదైన చిన్న కేసుల కోసం గత మూడు నెలలుగా రోజూ పోలీస్ స్టేషన్కు పిలిపించి వేధించడం వల్లే అతను ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.
ముఖ్యమంత్రి నివాసానికి, డీజీపీ, హోంమంత్రి కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగిందని జగన్ అన్నారు. “సీఐని కమిషనర్, కమిషనర్ను డీజీపీ, డీజీపీని ముఖ్యమంత్రి కాపాడుతున్నారు. ఇది ఒక ప్రొటెక్షన్ రాకెట్లా నడుస్తోంది” అని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయకపోవడం దారుణమన్నారు. క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయపరమైన సహాయంతో సహా అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ స్పష్టం చేశారు.








