కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో శనివారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు మూడు రోజుల క్రితమే నోటీసులు జారీ చేయగా.. శనివారం ఆయన తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో కలిసి స్వయంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయారు. అనంతరం పోలీసులు భగీరథ్ను అదుపులోకి తీసుకుని, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని స్పష్టం చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, ఈ విషయంలో తానేమీ వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని, ఫిర్యాదు అందిన వెంటనే స్టేషన్లో అప్పగించాలని అనుకున్నట్లు వివరించారు.
అయితే, పోలీసులకు అప్పగించడంలో కొంత ఆలస్యం కావడానికి గల కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు. తాము ముందుగా న్యాయవాదులను సంప్రదించి, తమ వద్ద ఉన్న ఆధారాలను వారికి చూపించామని అన్నారు. ఆ ఆధారాలను పరిశీలించిన లాయర్లు.. కేసు కొట్టేస్తారని, కచ్చితంగా బెయిల్ వస్తుందని భరోసా ఇచ్చారని చెప్పారు. అందుకే పోలీసుల ముందుకు రావడానికి కాస్త జాప్యం జరిగిందని బండి సంజయ్ మీడియాకు స్పష్టం చేశారు.







