తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయంలో పేద గ్రామాల్లో ఆలయాలు నిర్మాణం కోసం ఎంతో శ్రమించి పనులు చేపట్టామని, అయితే 2024 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఒక కలం పోటుతో ఆ నిర్మాణాలన్నింటినీ నలిపివేసిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఒక పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుని, పచ్చి దోపిడీకి తెరలేపిందని ధ్వజమెత్తారు.
ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసే 800 శ్రీవాణి టికెట్లు, కేవలం ఒక్క నిమిషంలోనే అంటే 9:01 కల్లా మాయమైపోతున్నాయని భూమన వివరించారు. టీటీడీ పెద్దల ఆశీస్సులతో దళారులు, దోపిడీ దొంగలు ఈ టికెట్లను ముందే బ్లాక్ చేస్తున్నారని.. ఒక్కో టికెట్పై అదనంగా రూ. 5 వేల వరకు వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలా రోజుకు 800 టికెట్ల ద్వారా దళారులు సుమారు రూ. 40 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని, ఇప్పటివరకు దాదాపు రూ. 48 కోట్ల మేర పెద్ద కుంభకోణం జరిగిందని లెక్కలతో సహా వివరించారు. ఈ దోపిడీని నిరూపించడానికి తాను స్వయంగా ఉదయం 8:57 నిమిషాలకు లాగిన్ అయి టికెట్ బుక్ చేసే ప్రయత్నం చేశానని, కానీ పేమెంట్ ఎర్రర్ వచ్చిందని.. 9:01 నిమిషానికే మొత్తం టికెట్లు అయిపోయాయని చెబుతూ దానికి సంబంధించిన వీడియోను ఆధారంగా చూపించారు.
ఐటీ రంగంలో నిష్ణాతులమని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు.. కనీస అర్హత లేని, గతంలో విదేశాల్లో విరాళాల పేరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఏఈఓ వెంకటేశ్వర నాయుడును టీటీడీ ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్ (ఇన్చార్జ్) గా ఎలా నియమించారని ఆయన ప్రశ్నించారు. కేవలం శ్రీవాణి టికెట్లే కాకుండా, ప్రతిరోజూ 2 వేల నుంచి 3 వేల వీఐపీ బ్రేక్ టికెట్లను కూడా బ్లాక్ మార్కెట్లో రూ. 3వేల నుంచి రూ. 5వేల కు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ5 యాజమాన్యానికి, వారి అనుచరులకు, రౌడీలు, గుండాలకు ఇష్టానుసారంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం తిరుమలలో విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, దానికి నిదర్శనంగా గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఒక వ్యక్తి బహిరంగంగా గంజాయి తాగుతున్న వీడియోను మీడియాకు చూపిస్తూ భద్రతా వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ ఆన్లైన్ టికెటింగ్ సిస్టం కుంభకోణంపై సీబీఐ లేదా మరేదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని, అవసరమైతే టీడీపీ ఆఫీస్కు రావడానికైనా తాను సిద్ధమేనంటూ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు







