‘రెంటల్ వర్సెస్ పర్సంటేజీ’పంచాయితీ ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. యస్.. గత కొన్ని రోజులుగా పోటా పోటీగా వేర్వేరు ప్రెస్ మీటలు పెట్టిన ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి తాజాగా ఫిలిం ఛాంబర్ లో కంబైన్డ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. డి. సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇండస్ట్రీలోని బడా ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు వంటి సీనియర్ల నుంచి నాగవంశీ, skn వంటి యంగ్ ప్రొడ్యూసర్స్ వరకు దాదాపు 50 మంది, అలాగే భారీ సంఖ్యలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ సంఖ్యలో రావడం చూస్తె ఇష్యూ ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది.
కొలిక్కి వచ్చిన చర్చలు
గతంలో ఉన్న ఫిక్స్డ్ రెంటల్ మోడల్ లో చిన్న సినిమాలే కాదు, ఒక్కోసారి పెద్ద సినిమాలు వేసుకున్నా రాబడి లేక ఎగ్జిబిటర్లు నిలువునా మునిగిపోతున్నారు. కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించలేక థియేటర్లు మూతపడే పరిస్థితి.మరో వైపు థియేటర్స్ బాగోలేకపోయినా పర్సంటేజీ అడగడం కరెక్ట్ పద్దతి కాదంటూ అటు ప్రొడ్యూసర్స్ ఆర్గుమెంట్.దీంతో మధ్యే మార్గంగా వీరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ కుదిర్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు సురేష్ బాబు.అయితే మొదట 15 మందితో అనుకున్న కమిటీని, చర్చల అనంతరం 18 మందికి పెంచారు. ఇందులో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల నుంచి చెరో ఆరుగురు ప్రతినిధులు ఉండి, రాబోయే రెండు నెలల పాటు గ్రౌండ్ రియాలిటీని ని చెక్ చేయనున్నారు. ఈ రెండు నెలల కాలంలో ప్రస్తుతం ఉన్న రెంటల్ సిస్టం కంటిన్యూ చేస్తూనే అమలు చేయాల్సిన ‘పర్సంటేజీ షేరింగ్’ (వసూళ్లలో వాటా) మోడల్పై ఈ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ని రెడీ చేయనుందని సమాచారం.
పెద్దికి లైన్ క్లియర్
అయితే ఈ ఇష్యూ మొదలవగానే జూన్ 4న వచ్చే పెద్ది పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపించింది. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సమావేశంలో ఒక రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.’రెంటల్ వర్సెస్ పర్సంటేజీ’పంచాయితీ కారణంగా తమ సినిమాకి ఎలాంటి అడ్డంకులు ఎదురుకోకుండా చూడాలని కోరుకున్నారట. ఇప్పటికే మార్చి 27, ఏప్రిల్ 30 తేదీల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు కూడా అనుకున్న జూన్ 4 కి గనుక సినిమా రాకపోతే భారీ లాస్ నే ఎదుర్కోవాల్సి వస్తుందని మైత్రీ టీమ్ ఆందోళన వ్యక్తం చేయగా, ఎగ్జిబిటర్లు కూడా సానుకూలంగా స్పందించి ‘పెద్ది’కి లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. అంటే అనుకున్నట్టుగా జూన్ 4న వచ్చేందుకు పెద్దికి లైన్ క్లియర్ అయిందన్న మాట.
60 రోజులు టాలీవుడ్ కి ఇంపార్టెంట్
సీనియర్ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ , ఈ చర్చలు కేవలం అద్దెకే పరిమితం కాలేదని పరిశ్రమలో ఇంకా పెండింగ్లో ఉన్న అనేక ఫైనాన్షియల్ ఇష్యూస్ కి కూడా చెక్ పెట్టేవిధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. థియేటర్లలో ట్రాన్స్ పరెన్సీ పెంచడం, చిన్న సినిమాలకు థియేటర్ల భారం తగ్గించడం వంటివి ఈ కమిటీ ప్రధాన అజెండాగా ఉన్నట్టు కనిపిస్తుంది. పర్సంటేజీ విధానం అమల్లోకి వస్తే, సినిమా రిజల్ట్ని బట్టి అటు నిర్మాతకు, ఇటు ఎగ్జిబిటర్కు న్యాయం జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.అయితే, సింగిల్ స్క్రీన్లపై ‘పెద్దల’ డామినేషన్ పెరగకుండా ఈ కమిటీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందనేది చూడాలి. మొత్తానికి రాబోయే 60 రోజులు టాలీవుడ్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట !








