మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ఎండగడుతూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
మాటలకు, చేతలకు పొంతన లేదు
చంద్రబాబు నాయుడు తాము ఖర్చులు తగ్గించుకుని, ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, ప్రజలు కూడా ఆ మాటలను నిజమేనని నమ్మే పరిస్థితి తెచ్చారని అమరనాథ్ విమర్శించారు. అయితే, ఆ ప్రకటనలు చేసిన 24 గంటలు కూడా గడవక ముందే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్లడం వారి నిజస్వరూపాన్ని చూపిస్తోందన్నారు. గత రెండేళ్ల కాలంలో చంద్రబాబు కేవలం ప్రత్యేక విమానాల్లో తిరగడానికే దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా నిరంతరం స్పెషల్ ఫ్లైట్లలోనే విహరిస్తున్నారని మండిపడ్డారు.
రూల్స్ పబ్లిక్కేనా?
చంద్రబాబు ప్రజలకు నీతులు చెబుతారు కానీ, వాటిని ఆయన మాత్రం పాటించరని అమరనాథ్ ఎద్దేవా చేశారు. జనాభా పెంచడం కోసం ప్రతి ఒక్కరూ ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారని, మరి ఆ సూత్రాన్ని తన సొంత కొడుకు లోకేష్కు ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు. కేవలం పబ్లిసిటీ స్టంట్లతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, నిబంధనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలోని చంద్రబాబు నివాస మరమ్మతుల కోసమే ఏకంగా రూ. 6.50 కోట్లు కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం సుమారు రూ. 3,70,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ధ్వజమెత్తారు.
టీడీపీ, వైసీపీ ఒక్కటి కాదు
టీడీపీ, వైఎస్సార్ సీపీ రెండూ ఒకటేనంటూ లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలను అమరనాథ్ తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ అనేది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల నుంచి, ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ అని.. అదే టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘వైస్రాయ్ హోటల్’ నుంచి పుట్టిందని గుర్తుచేశారు. టీడీపీది ‘బీరు, బారు’ సంస్కృతి అయితే, వైఎస్సార్ సీపీది పేదలకు మేలు చేసే ‘విద్యా, వైద్య’ విధానాల పార్టీ అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే చంద్రబాబు, లోకేష్లకు నరనరాన భయం కనిపిస్తోందని, ఆ భయంతోనే వారిలో వణుకు మొదలైందని అమరనాథ్ వ్యాఖ్యానించారు.








