ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువుపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని తెలిపారు.
గత ఏప్రిల్ నాటికే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవ్వడం ప్రాజెక్టు నిర్మాణం వేగానికి సంకేతమని పేర్కొన్నారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా నిర్మాణ పనులకు పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరినట్టు నిమ్మల తెలిపారు.
ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని మంత్రి చెప్పారు. గోదావరి-కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. ప్రతి ఏటా గోదావరి నుంచి సుమారు 3000 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, ఈ నీటిని మళ్లించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. దీనికి సంబంధించి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పెంపు కోసం విజయనగరంలో ప్రయోగాత్మకంగా ఎంసీఏడీ మోడల్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.







