తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని, హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పెరిగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఎంతో కష్టపడి స్కైరూట్ (Skyroot) వంటి ప్రతిష్టాత్మక కంపెనీని రాష్ట్రానికి తీసుకువస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి కేవలం రిబ్బన్ కట్ చేసి ఆ క్రెడిట్ అంతా తమదే అన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడుతూ, వారు నటనలో విశ్వనటుడు కమల్హాసన్ను మించిపోయారని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలును పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, అసలు ఆ నదిని దుర్గంధం చేసింది వారి ప్రభుత్వాలేనన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆయన గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై స్పందిస్తూ, ఆయన కేవలం ఢిల్లీకి మూటలు మోయటం తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రం రూ. 3.70 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని స్వయంగా ముఖ్యమంత్రే అంగీకరించారని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ మోసపు హామీలను గుర్తించారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.







