AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. క‌విత ట్వీట్ వైరల్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, క‌ల్వ‌కుంట్ల‌ కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన అనంతరం ఆమె ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తొలి ట్వీట్ చేశారు. “మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.” అంటూ పోస్ట్ చేశారు. శనివారం మునీరాబాద్‌లో జరిగిన సభలో కవిత తన నూతన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

టీఆర్ఎస్ నేత రంగు నవీన్ ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటుతో బీఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తన స్వలాభం కోసం తెలంగాణవాదాన్ని, అస్తిత్వాన్ని గాలికొదిలేసిందని, ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన ఆ పార్టీకి ‘ఒరిజినల్’ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను హింసించిన వారికి, అస్తిత్వాన్ని అవమానించిన వారికి పదవులు ఇచ్చిన బీఆర్ఎస్ చరిత్రను ఆయన గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కానీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

 

గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా గెలవడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడానికి కవితక్కనే ప్రధాన కారణమని గుర్తుచేశారు. కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించి, ఉద్యమానికి ఊపిరి పోసింది ఆమెనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చుకున్నప్పుడే తెలంగాణ సమాజం వారిని తిరస్కరించిందని, ఇప్పుడు కవిత రూపంలో ‘నిజమైన’ తెలంగాణవాదం మళ్లీ ప్రజల ముందుకు వస్తోందని రూప్ సింగ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ భవనం నేలకూలడం ఖాయమని నేతలు హెచ్చరించారు.

 

మంచాల వరలక్ష్మి మాట్లాడుతూ.. తన తండ్రి (కేసీఆర్) మీద కవిత విమర్శలు చేసిందని మాట్లాడుతున్న వారు.. తెలంగాణ ఆత్మను గాలికొదిలేసిన బీఆర్ఎస్ తీరును గమనించాలని సూచించారు. కేటీఆర్ ఇన్ స్టా అకౌంట్ లో టీఆర్ఎస్ అని, ట్విట్టర్ లో బీఆర్ఎస్ అని పెట్టుకున్నారని, వారి పార్టీకే స్పష్టత లేదని నరేష్ ప్రజాపతి ఎద్దేవా చేశారు. ఇకపై తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల ఆశయాలను కాపాడే బాధ్యతను కవితక్కే భుజాన ఎత్తుకుంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క ఉంటుందని, ట్రోల్స్ చేసే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించారు.

ANN TOP 10