ఖమ్మం జిల్లా కేంద్రంలోని దాదాపు అన్నీ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్రోల్ బంక్లు మూతపడుతున్నాయి. నోస్టాక్ బోర్డులు లేని పెట్రోలు బంకులవద్ద ఇంకా ఉద్రిక్తతలుకొనసాగుతున్నాయి. వాహనదారులు గంటల తరబడి పెట్రోల్ డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న వారికి కొందరికే శనివారం రేషనింగ్ పద్దతిలో పంపిణీ చేశారు. రాత్రి ఆయిల్ బంకుల్లో ఘర్షణలు జరుగుతుండటం వల్ల పోలీస్లు వచ్చి పరిస్థితి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇంధనం పంపిణీ చేశారు. ఆదివారం బంక్కు వెళ్లిన వారికి నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో మరింత కొరత
వాహనదారులకు గత 24 గంటల వ్యవధిలో పెట్రోల్ బంక్ ల వద్ద ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచే వాహనదారులు పెట్రోలు, డీజిల్ కోసం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం ఉదయం కొన్ని పెట్రోల్ బంకుల వద్ద ద్వి చక్ర వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. గంటల వ్యవధిలోనే నోస్టాట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే కొంతమంది బాటిల్స్, ఆటోలు, బైకుల్లో అదనంగా ఇంధనం నిల్వ చేసుకున్నారు. చాలా మంది వాహనదారులకు పెట్రోలు కొరత వల్ల వెనుదిరిగి వెళ్లారు. దీంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో జిల్లా అధికార యంత్రాంగం నుంచి స్పష్టమైన ప్రకటనలు లేకపోవడం వల్ల ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది. నిన్నటి నుంచి పరిస్థితి విషమంగా మారినా, అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ధరలు పెరిగే అవకాశం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని పలు బంకులతో పాటు మండలాల్లో కూడా ఇంధన సరఫరా అంతరాయం ఏర్పడడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింటోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎన్జీ తో నడిచే ఆటోలకు ఆదివారం రాత్రి వరకే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇంధన కొరత ప్రభావం వల్ల నిత్యావసర సరుకుల రవాణాపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. మార్కెట్లకు సరఫరాలు ఆలస్యమవుతుండటంతో ధరలు పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సమస్య తీవ్రమైన తర్వాతే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నాయి.
బంకుల వద్ద నిరీక్షణ..
ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందని వాహన దారులు అభిప్రాయపడు తున్నారు. యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో లేని ఇంత ఎమర్జెన్సీ పరిస్థితి ఈ 24 గంటల్లో ఎందుకు వచ్చింది? వివిధ ప్రాంతాల నుంచి పెట్రోల్ కోసం జనం క్యాన్లు తీసుకొని వస్తున్నారు. పెట్రోల్, డీజిల్ లేక వాహనాలు ఆగిపోవడంతో క్యాన్లు కొనుక్కొని బంక్ ల వద్దకు వస్తున్నారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద నిరీక్షణ కొనసాగుతూనే ఉంది ఏమి జరుగుతుందో తెలియటం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు.







