రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ఆయన తన కుటుంబంతో సహా బీజేపీ గూటికి చేరుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఆయన కోడలు, మల్లారెడ్డి విద్యాసంస్థల కో-చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాషాయ పార్టీలో చేరేందుకు తీవ్రంగా పట్టుపడుతున్నట్లు సమాచారం. ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అయితే అత్యంత సీక్రెట్ గా భేటీ అవ్వడం వెనుక అసలు కారణమిదే అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎంపీ అభ్యర్థిగా పోటీ..
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మల్కాజిగిరి నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. వాస్తవానికి ఆమె గత ఎంపీ ఎన్నిక్లలోనే పోటీ చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పార్టీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేకపోవడం వల్ల వెనుకం వేసినట్లు సమాచారం. గత జరగిన పార్లమెంట్ ఎన్నికల్లో సీటు కోసం ప్రీతిరెడ్డి ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది. సీటు కోసం గట్టిగానే పట్టు పట్టినట్లు తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ భావజాలాలు..
ఇదిలా ఉండగా ఆమె గత కొంతకాలంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ, ప్రధాని మోడీ విధానాలను ప్రశంసిస్తోంది. కాగా ముందు నుంచే ప్రీతిరెడ్డిది ఆర్ఎస్ఎస్ భావజాలాలను అనుసరించే ఫ్యామిలీ అని తెలుస్తోంది. అందుకే బీజేపీకి దగ్గరవుతున్నట్లు టాక్. ఇప్పటికే ఆమె హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన లాల్ దర్వాజా బోనాల సమయంలో పాతబస్తీకి చెందిన ఒక బీజేపీ నేత ఇంటి నుంచి బంగారు బోనాన్ని ఎత్తింది. ఆ సమయంలో ఫ్లెక్సీలో కేంద్ర బండి సంజయ్ ఫొటోతో పాటు ప్రీతి రెడ్డి ఫొటోలు కూడా ఉండటంతో వైరల్ గా మారి పెద్ద చర్చకు దారితీసింది. మల్లారెడ్డి కోడలు.. ప్రీతిరెడ్డి.., కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకే టేబుల్ పై లంచ్ చేయడంతో చేరిక దాదాపు ఖారరైందన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగింది. తాజాగా ప్రధాని మోడీతో మల్లారెడ్డి కుటుంబీకులు భేటీ అవ్వడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
సీక్రెట్ గా భేటీ..?
ప్రధాని మోడీతో మల్లారెడ్డి కుటుంబం సీక్రెట్ గా భేటీ అవ్వడం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే స్వయంగా అపాయింట్ మెంట్ కుదిర్చినట్లు సమాచారం. గతంలో మల్లారెడ్డి.. కిషన్ రెడ్డిని కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు, అప్పటి నుంచే వీరి మధ్య చర్చలు మొదలైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ భేటీ కేవలం బిజినెస్ మీటింగ్ అని ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది రాజకీయ ప్రయోజనాల కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రీతిరెడ్డి తన ఇంటర్వ్యూల్లో హిందుత్వ అంశాలపై, దేశాభివృద్ధిపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటంతో ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చిన మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు, తన వారసులను రాజకీయాల్లో నిలబెట్టేందుకు బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.








