విశాఖపట్నం జిల్లా గాజువాకలో వెలుగుచూసిన మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇండియన్ నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తన మాజీ ప్రియురాలు మౌనికను అత్యంత క్రూరంగా అంతమొందించాడు. తన వివాహమైన తర్వాత కూడా మౌనిక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, ఆర్థిక సాయం కోరడంతో పాటు తన సర్వీస్ ఐడీ కార్డును ఆమె తన వద్దే ఉంచుకోవడంతో, తన ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయంతో రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, రవీంద్ర ఈ హత్యను పక్కా ప్రణాళికతో చేశాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో, ఆన్లైన్లో కత్తులు మరియు క్లీనింగ్ సామాగ్రిని ముందుగానే ఆర్డర్ చేసి పెట్టుకున్నాడు. ఆదివారం మౌనికను తన ఫ్లాట్కు పిలిపించి, గొడవ జరిగిన క్రమంలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆధారాలు దొరకకుండా చేసేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను ఫ్రిజ్లో దాచి, మరికొన్ని భాగాలను అడవివరం ప్రాంతానికి తీసుకెళ్లి తగులబెట్టాడు. నిందితుడు స్వయంగా తన స్నేహితుడికి ఈ విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు అతడికి ఏప్రిల్ 10 వరకు రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో రవీంద్ర భార్య ప్రమేయం ఉందా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మౌనిక తండ్రి కన్నీటిపర్యంతమవుతూ ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రిని వేడుకున్నారు.









