తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ప్రజల సంపదను రేవంత్ రెడ్డి కొల్లగొడుతున్నారని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఖర్చు కోసం ఇక్కడి నిధులను తరలిస్తున్నారని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండున్నర ఏళ్లలో కేవలం రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని మండిపడ్డారు. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని ధ్వజమెత్తారు.
ఎన్నికల వేళ 6 గ్యారెంటీలు, 66 హామీలతో ప్రజలను మోసం చేశారని, చట్టసభల్లో ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి సీఎం అమ్ముకుంటున్నారని ఆరోపించారు.








