ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ మూసివేసిన హర్మూజ్ జలసంధి సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి తెరిపించేందుకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నడుం బిగించింది. ఇందులో భాగంగా 35 దేశాలతో నిర్వహిస్తున్న అత్యవసర సమావేశానికి భారత్ను కూడా ఆహ్వానించింది. గురువారం వర్చువల్గా జరిగే ఈ భేటీలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ధ్రువీకరించారు.
భారత ఇంధన భద్రతకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 40శాతం, ద్రవీకృత సహజ వాయువు (LNG)లో 50శాతం, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)లో 80శాతానిపైగా ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ నేపథ్యంలో భారత నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇరాన్తో పాటు ఇతర సంబంధిత దేశాలతో చర్చిస్తున్నామని జైస్వాల్ తెలిపారు. ఈ చర్చల ఫలితంగానే గత కొన్ని రోజుల్లో ఆరు భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటగలిగాయని ఆయన వివరించారు.
ఈ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా స్పందించారు. గతంలో జలసంధిని తెరిపించడం తన ప్రాధాన్యత అని చెప్పిన ఆయన, బుధవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్లేటు ఫిరాయించారు. “మీ చమురు మీరే తెచ్చుకోండి. మీ కోసం మీరు పోరాడటం నేర్చుకోండి. అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు” అంటూ యూకే వంటి మిత్రదేశాలకు ఆయన సూచించారు. ఇరాన్ను ఇప్పటికే దెబ్బతీశామని, కష్టమైన భాగం పూర్తయిందని ట్రంప్ పేర్కొన్నారు.
మరోవైపు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూఏఈ సహా 35 దేశాలు సముద్ర భద్రత పునరుద్ధరణకు కలిసి పనిచేయడానికి అంగీకరించాయని ప్రకటించారు. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడం, చిక్కుకుపోయిన నౌకలు, సిబ్బంది భద్రతను పటిష్టం చేయడం, కీలక సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. యూకే విదేశాంగ కార్యదర్శి వైవెట్ కూపర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీ అనంతరం, తదుపరి కార్యాచరణపై అధికారులు చర్చిస్తారని సమాచారం.








