పశ్చిమాసియాలో యుద్ధం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, పొరుగు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని భారత్పై అనాలోచిత ఆలోచన చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా హెచ్చరించారు. పొరుగుదేశం ఉగ్రవాద చర్యలకు గతంలో ధీటుగా బదులిచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊహించనిరీతిలో భారత్ స్పందిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని కూడా ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
యూరి దాడి తర్వాత జరిపిన సర్టికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గామ్ దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్.. ఇలా ఉగ్రవాద చర్యలపై భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందించిందని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.








