ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక పరిణామంతో రాజధాని భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “గత ప్రభుత్వ పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. రైతుల త్యాగానికి దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఒక కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం.. అజరామరం” అని అన్నారు. రాజధానిని ప్రపంచపటంలో నిలిపేలా విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లోక్సభలో బిల్లుకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








