AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీటి వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు….

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ముఖ్యంగా ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రావిర్యాల ఈ-సిటీలో ఏర్పాటు చేసిన ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫార్మా రంగం మరో కీలక మైలురాయిని చేరుకుందని, అంతర్జాతీయ నగరాలైన సింగపూర్, టోక్యో, దక్షిణ కొరియా వంటి దేశాలతో తెలంగాణ నేడు పోటీ పడుతోందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక వృద్ధి – పెట్టుబడులు..

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. పారిశ్రామికవేత్తల్లో పూర్తి స్థాయి విశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘మేం కేవలం మాటలకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తలకు వెనువెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం వాటా ఒక్క హైదరాబాద్ నుంచే వస్తుండటం గర్వకారణమని అని అన్నారు. ప్రపంచం మొత్తం మన ఫార్మా రంగం వైపు చూసేలా వృద్ధి చెందామని కొనియాడారు.

నీటి వివాదాలపై సీఎం స్పందన..

నీటి వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదని.. పంచాయతీల కంటే శాశ్వత పరిష్కారాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో నెలకొన్న నీటి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ‘మా ప్రాజెక్టులకు మీరు సహకరిస్తే, మీ ప్రాజెక్టులకు మేం పూర్తి సహకారం అందిస్తాం’ అని పొరుగు రాష్ట్రాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

 

తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం కావడంతో.. పోర్ట్ కనెక్టివిటీ సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అభివృద్ధి విషయంలో ఇరు రాష్ట్రాలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రాలు అభివృద్ధి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే.. తెలంగాణ పది అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం సామరస్యంగా ముందుకు వెళ్తామని సీఎం చెప్పుకొచ్చారు.

ANN TOP 10