నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు పోలీసు సేవలను మరింత సులభతరం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సరికొత్త విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సైబర్ మిత్ర (C-Mitra) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక విభాగాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బషీర్బాగ్లోని సీసీఎస్ (CCS) కార్యాలయంలో ప్రారంభించారు.
ఇంటి వద్ద నుంచే కంప్లైంట్
సాధారణంగా సైబర్ మోసానికి గురైన వారు 1930 హెల్ప్లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేసినప్పటికీ.. తదుపరి ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు కోసం పోలీస్ స్టేషన్కు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. దూరం, పని ఒత్తిడి లేదా భయం వల్ల దాదాపు 82 శాతం మంది బాధితులు స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. దీనివల్ల దేశవ్యాప్తంగా కేవలం 18 శాతం కేసులు మాత్రమే ఎఫ్.ఐ.ఆర్ వరకు వెళ్తున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చేందుకు సైబర్ మిత్ర వారధిగా నిలుస్తుందని సీపీ తెలిపారు.
నేరుగా మీ ఇంటికే సేవలు
ఈ నూతన విధానం ద్వారా బాధితులు తమ ఫిర్యాదును పోస్ట్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ద్వారా పంపవచ్చు. సైబర్ మిత్ర సెల్లోని పోలీసులు బాధితులకు ఫోన్ చేసి.. ఫిర్యాదు ఎలా రాయాలి..? ఏయే సెక్షన్లు వర్తిస్తాయి..? అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇంటి నుండే ఎఫ్.ఐ.ఆర్ పొందే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా 100 శాతం కేసుల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నారు.
కీలక అంశాలు..
– ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
– ప్రస్తుతం 24 మంది ప్రత్యేక సిబ్బందితో ఈ సెల్ పనిచేస్తుంది. అవసరాన్ని బట్టి సిబ్బందిని పెంచనున్నారు.
– ఏఐ (AI) ద్వారా వర్చువల్ సేవలను కూడా అందిస్తున్నారు. కేవలం పోలీస్ సిరీస్ నంబర్ల నుండి మాత్రమే బాధితులకు కాల్స్ వస్తాయి.
జాగ్రత్తలు తప్పనసరి..
సైబర్ మోసాల గురించి సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఓటీపీ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు ఎప్పుడూ ఓటీపీలు లేదా వ్యక్తిగత వివరాలు అడగరని అన్నారు. పోలీసుల పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ నమ్మవద్దని సజ్జనార్ స్పష్టం చేశారు. మోసపోయిన వెంటనే గోల్డెన్ అవర్ లో 1930 నంబర్కు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును రికవరీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.









