తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో భాగంగా, రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రీ స్కూల్ పిల్లలకు (3-6 సంవత్సరాల వయస్సు వారికి) అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏడాదిలో సుమారు 200 రోజుల పాటు ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఇది విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.
ఈ పథకంలో భాగంగా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశాల మేరకు, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారికి రోజూ 100 మిల్లీలీటర్ల ‘విజయా డెయిరీ డబుల్ టోన్డ్ యూహెచ్టీ టెట్రా’ పాల ప్యాకెట్లను అందించనున్నారు. ఈ పాలను వేడి చేసి, పంచదార లేదా బెల్లం కలిపి గోరు వెచ్చగా పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం అమలుపై క్షేత్రస్థాయి ఉద్యోగులు, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
మంత్రి సీతక్క సోమవారం ములుగులోని కృష్ణ కాలనీ ప్రీ-స్కూల్ పిల్లలకు పాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. పిల్లలను సొంత వారిలా చూసుకోవాలని ఆమె అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు.








