ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రం ‘వారణాసి’ టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా రాజమౌళి మాట్లాడారని ఆ సంస్థ ఆరోపించింది, దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో వానరసేన సభ్యులు, “ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది. మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవిరుద్ధం,” అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాజమౌళిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, మరికొందరు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని సమర్థిస్తున్నారు. కాగా, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ‘వారణాసి’ చిత్రాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.








