తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంగళరావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహించిన సీఎం, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో పోటీ పెట్టకూడదనే రాజకీయ సంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు. గతంలో పీజేఆర్ (పీ. జనార్దన్ రెడ్డి) మరణించినప్పుడు కూడా బీఆర్ఎస్ దుర్మార్గంగా తమ అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరానికి గోదావరి నీళ్లు తెచ్చిన ఘనత పీజేఆర్దేనని కొనియాడారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. రాజకీయ విమర్శల పరంపరలో, ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం అని ఎద్దేవా చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చారా అని ఆయన నిలదీశారు.
ప్రచారంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు హామీ ఇచ్చారు. నవీన్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నాయకులు వస్తే వారికి వాతలు పెట్టాలని ఓటర్లకు సూచించారు. జూబ్లీహిల్స్ బైపోల్ను బీఆర్ఎస్ సెంటిమెంట్గా మార్చే ప్రయత్నం చేస్తోందని, కంటోన్మెంట్లో కూడా అదే విధంగా సెంటిమెంట్ను నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.









