AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా టారిఫ్‌ల పెంపుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందన..

అమెరికా ప్రభుత్వం దిగుమతులపై సుంకాలను పెంచినప్పటికీ, భారత జీడీపీపై దాని ప్రభావం అంతగా ఉండదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కేవలం ఎగుమతులపైనే ఆధారపడలేదని, బలమైన దేశీయ మార్కెట్ మనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా టారిఫ్‌ల వల్ల రెండు, మూడు రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందులో టెక్స్‌టైల్ రంగం ఒకటని ఆయన అంగీకరించారు. ఈ రంగం కొంత సవాలును ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

మరోవైపు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంశాలను గోయల్ ప్రస్తావించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేయగల ఆదాయం పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారని ఆయన ప్రశంసించారు. “నన్ను నిద్రపోనివ్వకుండా చేసేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదు, ప్రజల కోసం పనిచేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం” అని ఆయన చమత్కరించారు.

 

భారత్, అమెరికా రెండు ముఖ్యమైన దేశాలని, మంచి స్నేహితులని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చల గురించి ప్రస్తావిస్తూ, “మంచి పనులు జరగడానికి సమయం పడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల బీజింగ్‌లో జరిగిన ఎస్‌సీవో సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య స్నేహపూర్వక ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ANN TOP 10