బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినప్పుడు, అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదని, పూర్తిగా బీసీలకే రిజర్వేషన్లు ఇస్తే తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని విమర్శించారు.
హైదరాబాద్లో చేసినట్లే ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని ఆరోపించారు.
42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి, అందులో 10 శాతం ముస్లింలకు ఇస్తే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మరని ఆయన అన్నారు.