ఓటర్ల విషయంలో అణుబాంబు పేలుస్తామన్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, దానిని వెంటనే పేల్చాలని ఆయన ఎద్దేవా చేశారు.
అది పేలే సమయంలో దాని వల్ల తనకు హాని కలగకుండా చూసుకోవాలని సూచించారు. గతంలో భూకంపం అంటూ ఇలాగే హెచ్చరికలు జారీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత అది తుస్సుమని పేలిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చేసే వ్యాఖ్యలు సరికాదని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ ప్రక్రియను రాహుల్ గాంధీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.