తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
వివరాల్లోకి వెళితే, గురువారం వరంగల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను అటవీశాఖ మంత్రిగా ఉన్నందున, కొన్ని కంపెనీలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం నా వద్దకు వస్తుంటాయి. సాధారణంగా మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం ఒక్క నయాపైసా కూడా ఇవ్వొద్దని, దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని వారికి చెబుతున్నాను” అని వ్యాఖ్యానించారు.
ఒక కంపెనీ ఫైల్ ఆమోదం కోసం తనను సంప్రదించినప్పుడు, ఆ కంపెనీకి కాలేజీ భవనం నిర్మించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆ కంపెనీ రూ.4.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి ముందుకు వచ్చిందని, ఇది తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
అయితే, మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యర్థులకు అస్త్రంగా మారాయి. ఇది ప్రభుత్వంలో అవినీతికి నిదర్శనమంటూ వారు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు.
“గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునేవారని నేను అన్నాను. ఆ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించే నేను ఆ వ్యాఖ్యలు చేశాను” అని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని, ఈ అంశంపై త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు.
కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో నటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిందిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ విషయంలో నటుడు నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా ఆమెపై పరువునష్టం దావాలు కూడా దాఖలు చేశారు