మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్(36)గా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే అతడిపై అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. అతడిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామదాస్ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి పోలీసు బలగాలు. రామదాస్ 2019 నుంచి ఓ కేసులో భాగంగ బెయిల్ మీద ఉన్నాడని పోలీసులు తెలిపారు.
జరిగింది ఇదే..
సతారా జిల్లాలోని ఫల్తానా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. పుణేలోని ఇళ్లలో పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్టాండ్లో బస్సు కోసం వేచిచూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను గమనించిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి అక్క అని సంబోధిస్తూ.. బస్సు ముందు ఉందంటూ తీసుకెళ్లాడు. అక్కడ అంతా చీకటిగా ఉండగా.. బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని.. అందుకే లైట్లు ఆన్ చేయలేదని మహిళను నమ్మించాడు.
దీంతో అది నమ్మిన ఆ మహిళ బస్సు ఎక్కగానే.. వెంటనే లోపలికి చేరుకున్న ఆ వ్యక్తి డోర్ వేసి.. ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. బయటికి వచ్చి మరో బస్సు ఎక్కిన ఆ మహిళ.. తనపై జరిగిన అత్యాచార ఘటన గురించి తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో ఆ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. అనంతరం బాధితురాలు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.









