8న యాదాద్రి జిల్లాలో పర్యటన
తన బర్త్డే సందర్భంగా కీలక నిర్ణయం
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాదయాత్రకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 8న ఆయన మూసీ వెంట పాదయాత్ర చేయబోతున్నట్లు రాష్ట్రంలో హాట్హాట్ చర్చ జరుగుతోంది. ఆ రోజున తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం యాదాద్రి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయబో తున్నారు. ముందుగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం వలిగొండ మండలంలో మూసీ పరీవాహక ప్రాంతం వెంట సీఎం పాదయాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, అధికారులకు సంకేతాలు అందినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రానికి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలకు సీఎం సవాల్
రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షాల చెబుతున్న అభ్యంతరాలకు కౌంటర్గా ఇటీవల సీఎం మాట్లాడుతూ. మూసీ పునరుజ్జీవం వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్ తనతో కలిసి నడుస్తారా..? అని సవాల్ విసిరారు. పాదయాత్రలో వారి ముందే స్థానిక ప్రజలను మూసీని బాగు చేయాలో వద్దో అడుగుదామన్నారు. దీంతో సీఎం చాలెంజ్ పై స్పందించిన హరీశ్రావు, కేటీఆర్ తాము పాదయాత్రలకు సిద్ధమేనని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోవైపు ప్రజల కోసం తాను త్వరలో పాదయాత్ర చేయబోతున్నానని కేటీఆర్ ఇటీవలే డిక్లేర్ చేశారు. అయితే కేటీఆర్ ఒక్కరే కాకుండా హరీశ్రావును సైతం రంగంలోకి దించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.