AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు మినహా.. జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ని నెలల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. అక్టోబర్ మాసంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మూడు అల్పపీడనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి. తాజాగా.. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు.

హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్రానికి తూర్పు, ఈశాన్య దిశలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని చెప్పారు. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇక బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

ANN TOP 10